పాదచారుల (Pedestrians) భద్రతపై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. ఫుట్పాత్(Footpath)పై సురక్షితంగా నడవడం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు(Fundamental Right) అని స్పష్టం చేసింది. వాహనాల రాకపోకల కంటే పాదచారులకే అధిక ప్రాధాన్యత ఉండాలని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూకర్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
రహదారులు ఉన్న ప్రతి చోట కాలిబాటలను ఏర్పాటు చేయడం, వాటి నిర్వహణ బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలదేనని కోర్టు గుర్తు చేసింది. ఫుట్పాత్లు లేకపోవడం లేదా ఉన్న వాటిని వాహనాలు ఆక్రమించడం తీవ్రమైన సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది.
పాదచారుల సురక్షిత నడక హక్కు ఉల్లంఘనకు గురైతే సంబంధిత అధికారులపై నష్టపరిహారం కోసం న్యాయపరంగా చర్యలు తీసుకునే హక్కు పౌరులకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
కొంతకాలం క్రితం తండ్రితో కలిసి పాఠశాలకు వెళ్తున్న ఓ బాలుడు లారీ ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో పాదచారుల మార్గంలో లోపాలున్నాయని పేర్కొంటూ బాలుడి తండ్రి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు బాలుడి కుటుంబానికి ఇవ్వాల్సిన పరిహారాన్ని రూ.11.44 లక్షలకు పెంచుతూ, రెండు నెలల్లోగా చెల్లించాలని ఆదేశించింది.
