విజయవాడ(Vijayawada)లోని ప్రముఖ చిన్నపిల్లల ఆసుపత్రి అయిన రెయిన్బో హాస్పిటల్(Rainbow Hospital)లో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు(Emergency Ward)లో ఉన్న ఎలక్ట్రికల్ బోర్డులో షార్ట్సర్క్యూట్ జరగడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, దట్టమైన పొగలు వ్యాపించాయి.
ఆ సమయంలో వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఉండటంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. పొగలు వ్యాపించడంతో కొంతసేపు ఆసుపత్రి ప్రాంగణంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రమాదాన్ని గమనించిన వైద్యులు, నర్సులు వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ వార్డులో ఉన్న చిన్నారులను, ఇతర రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదం పూర్తిగా నియంత్రణలోకి రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఆసుపత్రి సిబ్బంది వేగంగా స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, అన్ని రోగులు సురక్షితంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అధికారులు విచారణ చేపట్టారు.
