హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఆదివారం బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పలు ఆలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించగా.. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. లాల్దర్వాజా, సుల్తాన్షాహీ, హరిబౌలి, బేలా, ఉప్పుగూడ ప్రాంతాల్లోని వీధులు, ఆలయాలు బోనాల సందడితో కళకళలాడుతున్నాయి. శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయం, శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయం, ఉప్పుగూడ మహంకాళి ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీలు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు బోనం తీసుకొచ్చే మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బోనాల వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు, అధికారులు, క్రీడాకారులు, సినీ ప్రముఖులు వివిధ ఆలయాలను సందర్శించి అమ్మవారిని దర్శించుకోనున్నారు.
ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ తన కుటుంబంతో కలిసి లాల్దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది. ఉదయం 10 గంటల సమయంలో ఎండోమెంట్స్ మంత్రి కొండా సురేఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల కోసం ఓల్డ్ సిటీలో సుమారు 2,000 మంది పోలీసులను మోహరించనున్నారు. కీలక కూడళ్లు, ఆలయాలు, ఊరేగింపు మార్గాల్లో ప్రత్యేకంగా పోలీసులను అందుబాటులో ఉంచనున్నారు.
సోమవారం ఘటం ఊరేగింపులు
బోనాల వేడుకలు సోమవారం జరిగే సంప్రదాయ ఘటం ఊరేగింపులతో ముగియనున్నాయి. వివిధ ఆలయాల నుంచి ప్రారంభమయ్యే ఈ ఊరేగింపులు లాల్దర్వాజా, షాలిబండ, చార్మినార్, పాతేర్గట్టి మీదుగా సాగి.. మూసీ నది సమీపంలోని నాయాపూల్ ఆలయం వద్ద ముగియనున్నాయి. భారీగా భక్తులు, ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు భద్రత, ట్రాఫిక్, జనసందోహ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
