అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో (Parawada Pharma City) మంగళవారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫార్మాసిటీలోని దక్షిణ ఎనర్జీ కెమికల్ కర్మాగారంలో (Dakshina Energy Chemical Factory) ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించడంతో ఇద్దరు కార్మికులు సజీవదహనమయ్యారు.
మరో ఇద్దరు కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం అందుతోంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది (Fire Department) ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాద తీవ్రత కారణంగా ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో భారీగా పొగలు అలుముకున్నాయి.
అగ్నిప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు కార్మికులు అచ్యుతాపురం ప్రాంతానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. మంటల్లో చిక్కుకున్న మరో ఇద్దరి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనతో పరవాడ ఫార్మాసిటీలో కలకలం రేగింది.
ప్రమాదంపై పోలీసులు, పరిశ్రమల శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
