బాలీవుడ్ నటి టబుకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తన అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, గొంతు, వీడియోలు, ఇతర వ్యక్తిగత గుర్తింపులను ఆన్లైన్లో ఉపయోగిస్తున్నారని టబు దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. టబు వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాలను అనధికారికంగా ఉపయోగించడంపై జస్టిస్ జ్యోతి సింగ్ ఎక్స్పార్టీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రక్షణలో AI, జనరేటివ్ AI, డీప్ఫేక్లు, ఫేస్ మార్ఫింగ్, GIFలు, మెషిన్ లెర్నింగ్ వంటి డిజిటల్ టెక్నాలజీలు కూడా ఉన్నాయి.
Google, Meta, X, Redditకు ఆదేశాలు
టబుకు సంబంధించిన అనధికారిక కంటెంట్ ఉన్న పలు వెబ్సైట్ లింక్లను తొలగించాలని లేదా వాటికి యాక్సెస్ నిలిపివేయాలని Google, Meta, X, Reddit తదితర డిజిటల్ ప్లాట్ఫారమ్లను కోర్టు ఆదేశించింది. మొత్తం 150కి పైగా గుర్తించిన URLలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కొన్ని లింక్లను తొలగించేందుకు సంబంధిత సంస్థలకు 36 గంటల గడువు ఇచ్చింది.
AI ద్వారా మార్ఫింగ్ చేసిన కంటెంట్పై అభ్యంతరం
తన పేరు, గుర్తింపును ఉపయోగించి AI ద్వారా మార్ఫింగ్ చేసిన అభ్యంతరకర కంటెంట్ను ఆన్లైన్లో ప్రచారం చేస్తున్నారని టబు ఆరోపించారు. తన సినిమాలు, ఇంటర్వ్యూలు, పబ్లిక్ కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలను మార్పులు చేసి ప్రచారం చేస్తున్నారని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. ఇలాంటి కంటెంట్ వల్ల తన ప్రతిష్ఠ, వ్యక్తిగత హక్కులు, వాణిజ్య విలువకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని టబు పేర్కొన్నారు. దీనిపై కోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది.
టబు పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు
టబు పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి.. తన అనుమతి లేకుండా సినిమా లేదా ఈవెంట్ బుకింగ్స్కు సంబంధించిన ప్రచారం చేస్తున్నారని కూడా ఆమె ఆరోపించారు. అలాగే తన ఫొటోలు, వీడియోలను ఉపయోగిస్తూ టీ-షర్టులు, హూడీలు, పోస్టర్లు, క్యాలెండర్లు, మగ్లు వంటి వస్తువులను విక్రయిస్తున్న కొన్ని వెబ్సైట్లపై కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఖాతాల వివరాలు ఇవ్వాలని ఆదేశం
అనధికారిక కంటెంట్ను ప్రచారం చేస్తున్న వ్యక్తులను గుర్తించేందుకు Google, Meta, X, Reddit, GoDaddy తదితర సంస్థలు తమ వద్ద ఉన్న బేసిక్ సబ్స్క్రైబర్ సమాచారం, IP లాగ్ వివరాలను అవసరమైన సందర్భాల్లో అందించాలని కోర్టు ఆదేశించింది. టబు దాఖలు చేసిన పిటిషన్లో ప్రాథమికంగా బలమైన కేసు ఉందని కోర్టు అభిప్రాయపడింది. అనధికారికంగా ఆమె వ్యక్తిత్వాన్ని ఉపయోగించడం వల్ల భవిష్యత్తులో భర్తీ చేయలేని నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ కేసును కమర్షియల్ సూట్గా నమోదు చేసిన కోర్టు.. ప్రతివాదులకు సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 7, 2026కు వాయిదా వేసింది. అయితే ఇది తుది తీర్పు కాదని, ప్రస్తుతానికి మధ్యంతర రక్షణ మాత్రమేనని కోర్టు స్పష్టం చేసింది.
