గత రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ పరిస్థితులు కొనసాగుతుండగానే, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గురువారం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్ష తీవ్రత దృష్ట్యా రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణ వాతావరణం – హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు:
హైదరాబాద్ వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం, రాబోయే కొన్ని గంటల్లో భాగ్యనగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం, నిజామాబాద్ తదితర జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడనున్నాయి.
- ఆరెంజ్ అలర్ట్ (భారీ వర్షాలు): సంగారెడ్డి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ఈ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
- ఎల్లో అలర్ట్ (మోస్తరు వర్షాలు): వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో సాయంత్రంలోగా మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. హైదరాబాద్తో పాటు ఇతర ప్రభావిత జిల్లాలకు ఎల్లో అలర్ట్ అమల్లో ఉంటుంది.
- ఈదురుగాలులు: వర్షం పడే సమయంలో గంటకు 40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని అధికారు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్లో పిడుగుల ముప్పు – అప్రమత్తమైన విపత్తు నిర్వహణ సంస్థ:
ఏపీలోనూ రాబోయే కొన్ని గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది.
- ఆరెంజ్ అలర్ట్: విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా విజయనగరం, ఎస్.కోట, భీమునిపట్నం, కొత్తవలస, భోగాపురం, ఆనందపురం, సబ్బవరం, అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో పిడుగులు పడే ప్రమాదముందని హెచ్చరించారు.
- ఎల్లో అలర్ట్: పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వగా, ఇక్కడ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
ప్రజలు, ముఖ్యంగా రైతులు మరియు పొలాల్లో పనిచేసే కూలీలు వర్షం కురిసే సమయంలో చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
