మధ్య ఆఫ్రికా దేశమైన కాంగో(Congo)లో ఎబోలా వైరస్‌(Ebola virus) వేగంగా వ్యాపిస్తూ ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్‌ కారణంగా ఇప్పటివరకు 100 మందికి పైగా మృతి చెందగా, పరిస్థితి రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఈ విషయాన్ని కాంగో ఆరోగ్య అధికారులు అధికారికంగా వెల్లడించారు.


ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 550కిపైగా ఎబోలా కేసులు నమోదయ్యాయి. వీరిలో 101 మంది ప్రాణాలు కోల్పోగా, 19 మంది పూర్తిగా కోలుకున్నారు. మరో 309 మంది అనుమానిత రోగులను ఐసోలేషన్‌లో ఉంచి వైద్య పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.


ఆదివారం ఒక్కరోజే ఇటురి (Ituri), నార్త్‌ కివు (North Kivu) ప్రాంతాల్లో 35 కొత్త ఎబోలా కేసులు నమోదు కాగా, మరో 10 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా కొనసాగుతున్నప్పటికీ, రాబోయే రోజుల్లో పరిస్థితి కొంతమేర అదుపులోకి వచ్చే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు. అయితే, వ్యాధిని త్వరగా గుర్తించడం, వైరస్‌కు సమర్థవంతమైన టీకా మరియు పూర్తి స్థాయి చికిత్స అందుబాటులో లేకపోవడం ప్రధాన సవాళ్లుగా మారినట్లు అధికారులు పేర్కొన్నారు. అధికారికంగా నమోదైన కేసుల కంటే వాస్తవ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు.


ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అప్రమత్తమైంది. వైరస్‌ ప్రాంతీయ స్థాయిలో మరింత విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఇక పొరుగు దేశమైన ఉగాండాలో కూడా ఎబోలా ప్రభావం కనిపిస్తోంది. అక్కడ ఇప్పటివరకు 19 ఎబోలా కేసులు నిర్ధారణ కాగా, ఇద్దరు మృతి చెందినట్లు ఆరోగ్య అధికారులు వెల్లడించారు.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *