కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ ఆకాశమే హద్దుగా పెరుగుతుండటంతో కొనుగోలుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయంగా ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువలో వస్తున్న మార్పుల కారణంగానే పసిడి పరుగులు పెడుతోందని బులియన్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. గత సోమ, మంగళవారాల్లో పది గ్రాముల పసిడిపై దాదాపు రూ. 1000 వరకు ధర పెరగగా, బుధవారం కూడా స్వల్పంగా పుంజుకుంది.
ప్రస్తుతం దేశీయంగా 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,44,230 కి చేరగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,32,210 వద్ద కొనసాగుతోంది. అయితే బంగారానికి భిన్నంగా కిలో వెండి ధరపై రూ. 100 మేర తగ్గి రూ. 2,34,900 వద్ద స్థిరపడింది.
ప్రధాన నగరాల విషయానికి వస్తే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, చెన్నై మరియు బెంగళూరులలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,44,230 గాను, 22 క్యారెట్ల ధర రూ. 1,32,210 గానూ ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,44,380 ఉండగా, 22 క్యారెట్ల రేటు రూ. 1,32,360 గా నమోదైంది.
వెండి విషయానికొస్తే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నైలలో కిలో వెండి ధర రూ. 2,40,100 కాగా.. ముంబై, ఢిల్లీ, బెంగళూరులలో రూ. 2,34,900 వద్ద లభిస్తోంది. స్థానిక పన్నులు, ప్రాంతీయ డిమాండ్ ఆధారంగా ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయని గమనించాలి.
