బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి బులియన్ మార్కెట్ మళ్లీ షాక్ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా స్వల్పంగా తగ్గుతూ ఊరటనిచ్చిన పసిడి ధరలు గురువారం (ఆగస్టు 6) తిరిగి పుంజుకున్నాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న రాజకీయ, ఆర్థిక పరిణామాల వల్లే బులియన్ మార్కెట్లో ఈ రకమైన హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధరపై రూ. 10 పెరిగి రూ. 1,45,760కి చేరింది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర కూడా రూ. 10 పెరిగి రూ. 1,33,610గా నమోదైంది. పసిడి బాటలోనే వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి ధరపై రూ. 100 మేర పెరిగి మార్కెట్లో రూ. 2,40,100 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,45,760గానూ, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,33,610గానూ కొనసాగుతోంది. ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లో కూడా సరిగ్గా ఇవే ధరలు ఉన్నాయి. అలాగే ఈ నగరాల్లో కిలో వెండి ధర రూ. 2,40,100 వద్ద లభిస్తోంది. అయితే, పన్నుల వ్యత్యాసం వల్ల దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం పసిడి రేట్లు కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,45,910 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,33,760గా నమోదైంది.
అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త వాతావరణమే పసిడి ధరల పెంపునకు ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇరాన్ – అమెరికా మధ్య పెరుగుతున్న యుద్ధ వాతావరణం, ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక-ఆర్థిక అనిశ్చితి వల్ల పెట్టుబడిదారులు సురక్షితమైన మార్గంగా భావించి బంగారం వైపు భారీగా మొగ్గు చూపుతున్నారు.
