భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మహిళా క్రికెటర్లు ఎదుర్కొనే సవాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో తనకు నెలసరి వచ్చిన అనుభవాన్ని ఇన్స్టాగ్రామ్ వీడియోలో పంచుకున్నారు.
దేశం కోసం ఆడేటప్పుడు నొప్పిని కూడా భరించి బాధ్యత నిర్వర్తించాల్సి వస్తుందని తెలిపారు.
టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ప్యాడ్ మార్చుకోవాల్సిన అవసరం రావడంతో అంపైర్ అనుమతి తీసుకుని మైదానం వీడిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. తెల్లటి దుస్తులు ధరించి ఉండటంతో పరిస్థితిని వివరించగా అంపైర్ వెంటనే అర్థం చేసుకున్నారని చెప్పారు.
క్రికెట్ చట్టాల ప్రకారం అనారోగ్యం, గాయం లేదా ఇతర సమంజసమైన కారణాలతో ఆటగాడు మైదానం వీడితే ప్రత్యామ్నాయ ఫీల్డర్ను అనుమతిస్తారు. అయితే అతడు కేవలం ఫీల్డింగ్ మాత్రమే చేయగలడు. మహిళా క్రీడాకారుల శారీరక అవసరాలపై మరింత స్పష్టమైన మార్గదర్శకాలు అవసరమనే చర్చకు మంధాన వ్యాఖ్యలు దారితీశాయి.
