తెలంగాణలోని మత్స్యకారుల సంక్షేమం, జీవనోపాధి భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4.21 లక్షలకు పైగా నమోదిత మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా (Group Accident Insurance) కల్పిస్తున్నట్లు పశుసంవర్ధక, మత్స్య మరియు క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ పథకం అమలుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
బీమా వివరాలు & ప్రీమియం వాటా:
- అర్హులు: 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు కలిగిన 4,21,767 మంది నమోదిత మత్స్యకారులు ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారు.
- ప్రీమియం చెల్లింపు: ఒక్కో లబ్ధిదారునికి బీమా ప్రీమియం రూ. 79.96 కాగా, ఇందులో కేంద్రం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిష్పత్తిలో భరిస్తాయి.
- మత్స్యకారులపై పైసా భారం లేదు: రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ. 21.34 కోట్లు చెల్లిస్తుండటంతో, మత్స్యకారులకు ఉచితంగానే ఈ బీమా రక్షణ లభిస్తుంది.
- పాలసీ కాలపరిమితి: 2026 జూన్ 1 నుంచి ఈ పాలసీ అమలులోకి వచ్చి నిరంతర బీమా భద్రతను అందిస్తుంది.
ఈ పథకం ద్వారా లభించే పరిహారం:
- ప్రమాదవశాత్తు మరణిస్తే: రూ. 5.00 లక్షలు
- శాశ్వత సంపూర్ణ వైకల్యం సంభవిస్తే: రూ. 5.00 లక్షలు
- శాశ్వత పాక్షిక వైకల్యం కలిగితే: రూ. 2.50 లక్షలు
- ఆసుపత్రి చికిత్స ఖర్చులు: ప్రమాదవశాత్తు గాయపడి ఆసుపత్రిపాలైతే గరిష్ఠంగా రూ. 25,000 వరకు వైద్య సహాయం అందజేస్తారు.
మత్స్యకారుల కుటుంబాలకు ప్రమాదకర సమయాల్లో ఆర్థిక కొండంత అభయాన్ని అందించడమే లక్ష్యంగా ఈ సామాజిక భద్రతా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.
