పసిడి ప్రియులకు, కొనుగోలుదారులకు బులియన్ మార్కెట్ నుంచి కొంత ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో పెరుగుతూ ఆందోళన కలిగించిన బంగారం, వెండి ధరల్లో స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా పసిడి ధర స్వల్పంగా దిగొచ్చింది.
గత పది రోజుల్లోనే బంగారం ధరలు దాదాపు రూ.4,000 వరకు పెరగడం వినియోగదారులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బులియన్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ వివాదంతో పాటు అమెరికా-ఇరాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల వల్ల పెట్టుబడిదారులు సురక్షితమైన మార్గంగా భావించి బంగారంలో పెట్టుబడులు పెట్టడమే ఈ ధరల మోతకు కారణమైంది. అయితే బుధవారం రోజున రూ.700 వరకు తగ్గిన పసిడి ధర, గురువారం ఉదయానికి స్వల్ప మార్పులతో నమోదైంది.
తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.1,54,960 గా ఉండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,42,040 వద్ద కొనసాగుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,55,110 గాను, 22 క్యారెట్ల ధర రూ.1,42,190 గాను ఉంది. ముంబై, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోనూ తెలుగు రాష్ట్రాల స్థాయిలోనే ధరలు నమోదయ్యాయి.
మరోవైపు వెండి ధర కూడా పసిడి బాటలోనే పయనించి స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ.2,49,900 లుగా నమోదు కాగా, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.2,44,900 గా ఉంది. ప్రాంతీయ పన్నులు, రవాణా ఖర్చులు మరియు స్థానిక డిమాండ్ ఆధారంగా ధరల్లో కొంత వ్యత్యాసం ఉంటుంది.
