క్రికెట్‌ అంటే అభిమానులకు ముందుగా గుర్తుకు వచ్చేది ఇంగ్లాండ్‌లోని ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానం. ప్రస్తుతం ఇంగ్లాండ్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ ఇక్కడ ప్రారంభమైన నేపథ్యంలో ఈ చారిత్రాత్మక వేదిక మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటివరకు ఏ ఇతర మైదానం కూడా చేరుకోలేని మైలురాయిని లార్డ్స్‌ అందుకుంది.


ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం మూడు క్రికెట్‌ మైదానాల్లో మాత్రమే 100కు పైగా టెస్టు మ్యాచ్‌లు నిర్వహించారు. వాటిలో లార్డ్స్‌ స్టేడియం అగ్రస్థానంలో నిలిచింది. అంతేకాకుండా 150 టెస్టు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన తొలి, ఏకైక వేదికగా చరిత్ర సృష్టించింది.


ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న ప్రస్తుత మ్యాచ్‌ లార్డ్స్‌లో నిర్వహిస్తున్న 150వ టెస్టు కావడం విశేషం. ఈ ఘనతతో లార్డ్స్‌ ప్రపంచ క్రికెట్‌లో తన ప్రత్యేక స్థానాన్ని మరింత బలపరుచుకుంది.


లార్డ్స్‌ తర్వాత అత్యధిక టెస్టులకు ఆతిథ్యం ఇచ్చిన మైదానాల జాబితాలో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ) 118 టెస్టులతో రెండో స్థానంలో ఉంది. మరో ఆస్ట్రేలియా వేదిక సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ 114 టెస్టులతో మూడో స్థానంలో కొనసాగుతోంది.

భారత్‌లో అత్యధిక టెస్టులకు ఆతిథ్యం ఇచ్చిన మైదానం ఏది?


భారత్‌లో అత్యధిక టెస్టు మ్యాచ్‌లు నిర్వహించిన వేదికగా కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ నిలిచింది. దేశంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంగా గుర్తింపు పొందిన ఈ మైదానం ఇప్పటివరకు 43 టెస్టు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. భారత క్రికెట్‌ చరిత్రలో ఇదే అత్యధిక సంఖ్య కావడం విశేషం. ఈడెన్‌ గార్డెన్స్‌ తర్వాత చెన్నైలోని చెపాక్‌ స్టేడియం 35 టెస్టు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చి రెండో స్థానంలో ఉంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *