భారత్కు స్వాతంత్య్రం ఎప్పుడు వచ్చిందంటే.. ఠక్కున చెప్పే సమాధానం 1947 ఆగస్టు 15. ప్రతేడాది అదే రోజున దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుంటూ జాతీయ జెండాను ఎగురవేసి సంబరాలు చేసుకుంటాం.
అయితే దేశంలో ఓ నగరంలో మాత్రం ఆగస్టు 15కు కొన్ని గంటల ముందే.. అంటే ఆగస్టు 14 అర్ధరాత్రి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే సంప్రదాయం కొనసాగుతోంది. ఆ నగరం బిహార్లోని పూర్ణియా.
ఆగస్టు 14న ఎక్కడ జెండా ఎగురవేస్తారు?
బిహార్లోని పూర్ణియా నగరంలో ప్రతి ఏడాది ఆగస్టు 14 అర్ధరాత్రి జెండా ఎగురవేసే సంప్రదాయం ఉందని స్థానిక కథనాలు చెబుతున్నాయి. 1947లో స్వాతంత్ర్యం ప్రకటించిన సమయంలో స్వాతంత్ర్య సమరయోధుడు రామేశ్వర్ ప్రసాద్ సింగ్ తన సహచరులతో కలిసి జెండా ఎగురవేసినట్లు స్థానికంగా చెబుతారు. ఆ సమయంలో అర్ధరాత్రి 12.01 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, ప్రజలకు మిఠాయిలు పంచి స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించినట్లు కథనాలు ఉన్నాయి. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఈ సంప్రదాయం ఎందుకు?
1947 ఆగస్టు 14 అర్ధరాత్రి భారత్ స్వాతంత్ర్యం పొందిన సందర్భంగా పూర్ణియాలోని జెండా చౌక్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినట్లు స్థానిక చరిత్రలో పేర్కొంటారు. రామేశ్వర్ ప్రసాద్ సింగ్ కుటుంబ సభ్యులు ఈ సంప్రదాయాన్ని కొనసాగించగా.. ఆ తర్వాత స్థానిక ప్రజలు కూడా ఇందులో భాగమయ్యారని చెబుతున్నారు. అందుకే పూర్ణియాలో ఆగస్టు 14 అర్ధరాత్రి జెండా ఎగురవేయడం ఒక ప్రత్యేక సంప్రదాయంగా మారింది.
2025లో ఎన్నో స్వాతంత్య్ర దినోత్సవం?
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. భారత్ 1947లో స్వాతంత్ర్యం పొందింది. 2025 ఆగస్టు 15 నాటికి 78 సంవత్సరాలు పూర్తవుతాయి. అయితే 1947లో జరిగిన తొలి స్వాతంత్ర్య దినోత్సవాన్ని మొదటి వేడుకగా లెక్కిస్తారు. అందువల్ల 2025లో 79వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్నాం. అదే లెక్కన 2026 ఆగస్టు 15న భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది.
