విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత అధునాతనంగా నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని‘ ఆగస్టు 1న భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. భోగాపురంలో ప్రధాని మోదీ పర్యటన దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగనుంది.
ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ వివరాలు:
- ఉదయం 10:45 గంటలకు: ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు.
- స్వాగతం: ఎయిర్పోర్ట్లో ప్రధానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలుకుతారు.
- ఉదయం 10:58 గంటలకు: ఎయిర్పోర్ట్ నూతన టెర్మినల్ భవనాన్ని ప్రధాని ప్రారంభించి, గవర్నర్, సీఎంలతో కలసి పరిసరాలను పరిశీలిస్తారు.
- ప్రత్యేక ఆకర్షణగా సంప్రదాయ స్వాగతం: ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభా వేదిక వద్దకు ప్రధాని ఓపెన్ టాప్ వాహనంలో చేరుకుంటారు. ఈ సందర్భంగా 13,500 మందికి పైగా గిరిజన మహిళలు, విద్యార్థులు సంప్రదాయ ‘థింసా’ నృత్యంతో ప్రధానికి ఘనంగా స్వాగతం పలకనున్నారు.
- ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:55 వరకు: ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
- మధ్యాహ్నం 01:10 గంటలకు: పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిదర్శనం: సీఎం చంద్రబాబు
ప్రధాని చేతుల మీదుగా జరుగుతున్న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
“ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రారంభంతో ఏపీ విమానయాన రంగంలో కొత్త శకం ప్రారంభమవుతుంది. ఇది ఉత్తరాంధ్ర ప్రగతికి కీలక మైలురాయిగా నిలవడమే కాకుండా, ఈ ప్రాంతంలో ఉపాధి, పర్యాటకం, వాణిజ్య రంగాలు మరింత వేగంగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది.” — నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
